> ఆశ్రమం గురుంచి > గురు సత్సంగం
సత్సంగములోని ' పరమ పవిత్రత ' అనుభవముతో అర్థమవుతుంది కానీ, కేవలము మాటలతో అర్థముకాదు.
సత్ అనగా దైవము సంగమనగా స్నేహము.
ఇసుక, గాలితో స్నేహము చేసిన ఆకాశము వరకు ఎగురుతుంది. అదే ఇసుక, నీటితో స్నేహము చేసిన అట్టడుగున చేరుతుంది . ఇసుకకు పైకి పోవుటకు రెక్కలు గాని , నీటిలో దిగుటకు కాళ్ళు గాని లేవు. ఇసుక ఎగురుటకు గాలితోను , దిగుటకు నీటితోను చేసిన స్నేహమే కారణము .
ఇనుమును మట్టిలో వేసినపుడు తుప్పు పడుతుంది .అగ్నిలో వేసినపుడు మెత్త పడుతుంది .అట్టి ఇనుము చర్యలకు మూలం మట్టితోను ,అగ్నితోను చేసిన స్నేహమే కారణము.
మానవుడు చెడిపోవటానికి గాని , బాగుపడుటకు గాని సంగము చాలా ప్రధాన మైనది. కనుక మానవుడు మంచి సంగమును కోరుకోవాలి .
సత్సంగము అంటే పది మందిలో చేరి ఆధ్యాత్మిక భగవత్ విషయాలను గురించి చర్చించి తెలుసు కోవటం కాదు . సత్ అనగా దైవము , సంగము అనగా మానవునిలో పదిగా ఉన్న ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, సత్ తో అనగా దైవముతో స్నేహము చేయడమే సత్సంగము .
🌹బుద్ధ భగవానుని సత్సంగ సందర్శనములో అంగుళీమాలునికి " జ్ఞానోదయం " కలిగింది .
🌹కృష్ణ భగవానుని సత్సంగ సందర్శనముతో అర్జునికి " కర్తవ్య జ్ఞానం " తెలిసింది .
🌹 వశిష్ఠ మహర్షి వారి సత్సంగ సందర్శనముతో విశ్వామిత్ర మహర్షి " బ్రహ్మ ర్షి " అయినాడు .
🌹 నారద మహర్షి వారి సత్సంగ సందర్శనముతో వాల్మీకి మహర్షి చెక్కు చెదరని శ్రీ రామాయణమును అందించి " కవితాకోకిలం " బిరుదును పొందెను.
కావున మానవునికి, సత్సంగములోని "పరమ పవిత్రత " అనుభవముతో అర్థమవుతుంది .